అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు ..

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి నుండి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురం సిటీని వరద ముంచెత్తింది. నడిమి వంకకు వచ్చిన వ‌ర‌ద‌ల‌ వల్ల సుమారు 15 కాలనీలు మునిగిపోయాయి. వేలాదిమంది కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వ‌చ్చారు.

మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి చంద్రబాబునగర్, దండోరా కాలనీ, ముత్యాలప్ప కాలనీ, ఐదవ రోడ్డు, ఆరవ రోడ్డు, పక్కన ఉన్న కాలనీ నీట మునిగిపోవడంతో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి రాత్రి నుంచి సహాయక చర్యల్లో మునిగి పోయారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప అర్ధరాత్రి నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. బుధవారం వరద మరింత పెరగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రతి వార్డులో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన వసతిని సమకూర్చారు.