నేడు శ్రీశైలం గేట్ల ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద
నేటి మధ్యాహ్నం గేట్లను ఎత్తనున్న అధికారులు

శ్రీశైలం : శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల నుంచి 3,98,288 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా, జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.60 అడుగులుగా ఉంది. అలాగే, ప్రస్తుత నీటినిల్వ 172.6615 టీఎంసీలుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/