చింతామణి నాటకం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

చింతామణి నాటకాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం

hearing-in-ap-hc-on-chintamani-drama

అమరావతిః ‘చింతామణి’ నాటకం దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాటకంపై నిషేధం విధించింది. ఒక సామాజికవర్గం మనోభావాలు దెబ్బతీనే విధంగా నాటకం ఉందనే కారణంతో నాటకాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర కోర్టులో వాదనలు వినిపించారు.

చింతామణి ఒక సందేశాత్మక నాటకమని… దాన్ని నిషేధించడం సరికాదని అన్నారు. నాటకాన్ని నిషేధించడం వల్ల ఎంతో మంది కళాకారుల ఉపాధి దెబ్బతిన్నదని చెప్పారు. వ్యభిచారం నిరోధానికి కూడా ఈ నాటకం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఒక కులం మనోభావాలు గాయపడ్డాయని నాటకాన్ని నిషేధిస్తే… ఇతర కులాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/