మరోసారి వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..ఆ తర్వాత వరుసగా వివాదాల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా తాయత్తు వల్లే తాను బతికానని… డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని చెప్పి వివాదంలో చిక్కుకున్నారు.

కొత్తగూడెంలో ముస్లింలకు ఆయన తన జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన బాల్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారని… అప్పుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని… ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.

జీసస్ వల్లే కరోనా పోయిందంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలనే చేయడం ఫై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.