మేడ్చల్ లో దారుణం : తొమ్మిదో తరగతి విద్యార్థిని ఫై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం

సమాజంలో ఏది మంచి , ఏది చెడు, ఎలాంటి పని చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదు వంటి చెప్పాల్సిన గురువు..సమాజం తలదించుకునే పని చేసాడు. విద్యార్థిని గదిలోకి పిలిచి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు ధరించకపోవడం చూసి తన గదికి రావాలని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించాడు. దీంతో సదరు బాలిక భయంతో గదిలోకి వెళ్ళింది. ఆలా వెళ్లిన బాలికపై ఆ కామాందుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను హెచ్చరించడంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది.

గతంలో అదే పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు ఒకరు బుధవారం అక్కడికి వచ్చిన సందర్భంగా ఆమెను బాలిక కలిసింది. ఈ సందర్భంగా తనపై జరిగిన దారుణాన్ని బాలిక ఆమెతో చెప్పుకొని బాధపడింది. ఆమె తానున్నానంటూ ధైర్యం చెప్పడంతో తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం బయటకు రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆ ప్రధానోపాధ్యాయుడికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.