దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసారు పోలీసులు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టాయి. ఆ మేరకు వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబులు, బుల్లెట్లు, గన్‌పౌడర్‌ తదితరాలను తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గన్ పౌడర్ ఆర్డీఎక్స్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అరెస్టయిన ఉగ్రవాదులను గురుప్రీత్, అమన్ దీప్, భూపేంద్ర, పర్మిందర్ గా గుర్తించారు. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వారు ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్ర తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు దేశ సరిహద్దులకు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా తీసుకువచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్ ఈ ఆయుధాలు పంపినట్టు తెలిసింది.