ఆ యంగ్ హీరోను శిల్పా చౌదరి దారుణంగా మోసం చేసింది

అధిక వడ్డీ ఆశ చూపి సినీ ప్రముఖులను , వ్యాపారస్తులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి బయటకువస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్టు బయటపడగా..తాజాగా మరో యంగ్ హీరోను సైతం ఈమె మోసం చేసినట్లు బయటపడింది.

సెహరి సినిమా ఫేమ్ హీరో హర్షు కన్నుమెళ్ళ కూడా శిల్పా చౌదరి చేతిలో మోసపోయాడు. 3 కోట్ల రూపాయలు తీసుకొని తనను మోసం చేసిందని తాజాగా శిల్ప చౌదరిపై హీరో హర్ష్ ఫిర్యాదు చేశాడు. శిల్ప చౌదరి నిర్వహించే పార్టీలకు హాజరై ఈ హీరో అడ్డంగా బుక్కయ్యాడు. శిల్ప బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు.

హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది. డబ్బుల కోసమే ప్రతి వీకెండ్‌లో కిట్టిపార్టీలు శిల్ప ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.