భూముల రిజిస్ట్రేషన్లకు హరిత నిధి వసూలు చేసేందుకు సిద్దమైన తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్లకు హరిత నిధి వసూలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.50 చొప్పున తెలంగాణ హరిత నిధిని అధికారులు వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ సందర్భంగా ఈ మొత్తాన్ని ఈ స్టాంపుల రూపంలో వసూలు చేయబోతున్నారు. ఈ ఏడాది మార్చి 1 తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఈమేరకు ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో హరితనిధి మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హ‌రిత నిధి రుసుంను వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ‌రితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కులు నాటి.. పెంచుతున్న విషయం తెలిసిందే. దీనిలో ప్రజలను మరింత భాగ‌స్వామ్యం చేసేందుకు, నిధులను సమకూర్చేందుకు హ‌రిత నిధి రుసుంను ప్రభుత్వం వ‌సూలు చేయ‌నుంది.