మంత్రి నిర్మలా అధ్యక్షతన ప్రీ బడ్జెట్ సమావేశం..హరీశ్ రావు దూరం

హాజరైన అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కార్యదర్శులు

Harish Rao

హైదరాబాద్‌ః కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలపై ఢిల్లీలో శుక్రవారం జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరు కాలేదు. 2023- 24 బడ్జెట్టుపై కసరత్తులో భాగంగా.. బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రీ బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరవడం ఇది రెండో పర్యాయం. దీంతో రాష్ట్రం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

కాగా, కేంద్రంలోని అధికార బిజెపి, తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి అడుగు వేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ద్వారా జాతీయ స్థాయిలో బిజెపిని ఢీకొట్టేందుకు సిఎం కెసిఆర్ సిద్ధం అయ్యారు. అదే సమయంలో సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిగా టిఆర్ఎస్ కూడా బిజెపిపై నేరుగా విమర్శల దాడికి దిగింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/