కాలేజీలో ర్యాగింగ్‌.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం: హ‌రీశ్

ర్యాగింగ్ జ‌రిగిందో లేదో తెలుసుకునేందుకు క‌మిటీ
జ‌రిగిన‌ట్లు తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న హ‌రీశ్ రావు

హైదరాబాద్: సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. ఓ జూనియర్‌ విద్యార్థి దుస్తులు విప్పించి ఫొటోలు తీశారు సీనియర్ విద్యార్థులు. దీంతో తల్లిదండ్రులకు బాధిత విద్యార్థి సమాచారం ఇచ్చాడు ఆ విద్యార్థి. వారు 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో సీనియర్ల నుంచి పోలీసులు ఆ విద్యార్థిని కాపాడారు. ఈ ఘ‌ట‌న‌లో 25 మందిపై కేసు న‌మోదు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మెడికల్ కాలేజీలో జ‌రిగిన ఈ ర్యాగింగ్ ఘ‌ట‌న తెలంగాణ వ్యాప్తంగా అల‌జ‌డి రేపుతోంది. బాధిత విద్యార్థి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. బాధిత విద్యార్థిపై బలవంతంగా దుస్తులు తొలగించిన సీనియ‌ర్లు అక్క‌డితో వ‌దిలేయ‌కుండా ట్రిమ్మర్ తో జుట్టు తొలగించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. సీనియర్ల నుంచి తప్పించుకుని అత‌డు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఈ ర్యాగింగ్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ర్యాగింగ్ ఘ‌ట‌న‌పై వైద్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కూడా స్పందించారు. ర్యాగింగ్ వంటి ఘటనల‌ను రాష్ట్ర‌ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించామని తెలిపారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని, కమిటీ నుంచి రిపోర్ట్ రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ర్యాగింగ్ జ‌రిగిందో లేదో తెలుసుకునేందుకే ఈ క‌మిటీ వేశామ‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. నివేదిక ఈ రోజే వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/