ఓటుకు నోటు – సీటుకు నోటు అంటూ బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై మరోసారి విమర్శలు చేసారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉంద‌ని విమ‌ర్శించారు. కర్ణాటక ముఖ్య‌మంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తద‌ట‌.. ఇది మనం అనడం లేదు. కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడ‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయ‌ని హ‌రీశ్ రావు ఆరోపించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉంద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసు, ఓటుకు నోటు కేసులో ముద్దాయి. ఇలాంటి పార్టీల‌తో తెలంగాణ అభివృద్ధి జ‌రుగుతుందా? అని మంత్రి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి మీరే హై కమాండ్. మీరు ఏది కోరుకుంటే అది చేసే పార్టీ. టీఆర్ఎస్ లేకపోతే, సీఎం గా కేసీఆర్ లేకపోతే భూపాల‌ప‌ల్లి జిల్లా అయ్యేదా..? భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చేదా..? అని హ‌రీశ్‌రావు అడిగారు.

అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడిన జేపీ న‌డ్డాపై హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో ఒక్క ఎక‌రానికి కూడా నీరు పార‌లేద‌ని, ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టును న‌డ్డా చ‌దివారు. కాళేశ్వ‌రం నీళ్లు పంట పొలాల‌కు వ‌స్తున్నాయో, లేదా అనే విష‌యం తెలుసుకోవాలంటే భూపాల‌ప‌ల్లికి రావాలి. త‌మ రైతుల‌ను అడిగితే నీళ్లు వ‌చ్చాయా? లేదా? అన్న‌ది తెలుస్తుంద‌న్నారు. చిట్ట‌చివ‌రి టేకుమ‌ట్ల దాకా నీళ్లు వ‌చ్చాయ‌న్నారు. ఆనాడు నీళ్ల కోసం రైతులు త‌మ క‌ళ్ల‌ల్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తే.. నేడు నీరు చాలు, ఆపాల‌ని రైతులు కోరుతున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.