మంత్రి అమర్ నాధ్ కు హరిరామ జోగయ్య సూటి ప్రశ్న

ఏపీలో మంత్రి అమర్ నాధ్ ..మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత హరిరామ జోగయ్య ల మధ్య లేఖల పర్వం నడుస్తుంది. ముందుగా హరిరామ జోగయ్య..అమర్ నాధ్ కు లేఖ రాయడం జరిగింది. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివని, సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకని , అలాగే అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నానని లేఖ లో రాయడం జరిగింది. దీనికి మంత్రి అమర్ స్పందిస్తూ మరో లేఖ రాసారు.

‘కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కల్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ మంత్రి అమర్ నాధ్…హరిరామ జోగయ్య లేఖకు స్పందించారు. అలాగే మరో లేఖ హరిరామ జోగయ్య కు మంత్రి అమర్ నాధ్ రాసారు.

‘గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి.. వంగవీటి మోహన రంగా గారిని చంపించినది చంద్రబాబు నాయుడే అని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్‌ను మీరు సమర్థిస్తారా.. స్పష్టం చేయగలరు’అంటూ రెండో లేఖ రాశారు. కాగా అమర్ నాధ్ రాసిన లేఖ కు హరిరామ జోగయ్య స్పందించారు.

” వైస్సార్సీపీ పార్టీ 2024 ఎన్నికలలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలో అర్హులైన వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉందా..? ఈడబ్ల్యూఈఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ సీఎం జగన్ అమలు చేయలేకపోతే సహచర కాపు మంత్రులు వైయస్సార్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారా..? ” అని లేఖలో పేర్కొన్నారు. మరి దీనికి అమర్ నాధ్ ఏ సమాధానం చెపుతారో చూడాలి.