ముంబయి హైకోర్టులో నవనీత్ కౌర్ దంపతుల పిటిషన్

సీఎం ఉద్దవ్ థాకరే నివాసం ముందు నిరసనకు ప్రణాళిక

ముంబయి: మహారాష్ట్ర సర్కారు చర్యలను నిరసిస్తూ మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. హిందుత్వ అంశాన్ని శివసేనకు గుర్తు చేస్తామంటూ, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నవనీత్ కౌర్ రాణా, రవి రాణా నిర్ణయించుకోవడం తెలిసిందే. దీంతో పోలీసులు స్వచ్చందంగా వీరిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేసి కోర్టులో హాజరు పరిచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు వెలువడ్డాయి.

అమరావతి ఎంపీ నవనీత్ రాణా ను బైకుల్లా జైలుకు, బద్నేరా (అమరావతి) ఎమ్మెల్యే రవి రాణాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. తర్వాత నవీ ముంబై తలోజా జైలుకు మార్చారు. దీంతో రాణా దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ.. ‘‘అరెస్టుకు ముందు భార్యాభర్తలైన లోక్ సభ ఎంపీ, ఎమ్మెల్యే వారి నివాసంలోనే ఉన్నారు. వారు మాతోశ్రీకి (ఉద్దవ్ థాకరే నివాసం) వెళ్లాలనుకున్నారు. కావాలంటే వారిని పోలీసులు నిలువరించొచ్చు. పైగా వారు తమ ఇంటి నుంచే బయటకు రాలేదు. అటువంటప్పుడు ఏ చట్టం కింద వారిని అరెస్ట్ చేశారు?’’ అని ప్రకాశ్ జదవేకర్ ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/