హెచ్3ఎన్2 వైరస్‌తో హర్యానా, కర్ణాటకలలో ఇద్దరి మృతి

దేశవ్యాప్తంగా 90కి పైగా వైరస్ బాధితులు

H3N2 Influenza Virus: India Sees FIRST 2 Deaths From This Virus, Say Reports

న్యూఢిల్లీః దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో మరో వ్యక్తి కూడా ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఈ వైరస్ కారణంగా ఇన్ ఫ్లూయెంజా బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ వ్యాధి బాధితులు 90 మందికి పైనే ఉన్నారని అధికారవర్గాల సమాచారం.

అదేవిధంగా ఎనిమిది మంది హెచ్1ఎన్1 వైరస్ బారినపడ్డారని వెల్లడించాయి. ఫ్లూ బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోందని, అందులో చాలా వరకు హంకాంగ్ ఫ్లూ గా పిలిచే హెచ్3ఎన్2 బాధితులేనని వైద్యులు తెలిపారు. ఈ కొత్త వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వీటికి అదనంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మిగతా అనారోగ్యాల బారిన పడ్డ వారిలోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చని, అయితే వారం పైగా ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని చెప్పారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.