చాలామందికి ఇష్టమైన స్ట్రీట్‌ఫుడ్‌లో పానీపూరి ఒకటి.

చాలామందికి ఇష్టమైన స్ట్రీట్‌ఫుడ్‌లో పానీపూరి ఒకటి. ఆ బండి కనిపిస్తే చాలా నోట్లో నీళ్లూరుతుంటాయి. ఇక చిన్నపిల్లల సంగతైతే చెప్పక్కర్లేదు. అలాంటి వారందరికీ ఇది షాకింగ్ వార్తే. ఈ వార్త చదివిన తర్వాత పానీపూరీ బండివైపు చూడాలంటేనే భయపడతారనడం అతిశయోక్తి కాదు.

ఇప్పటికే పానీపూరీ బండ్ల వద్ద పరిశుభ్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నవేళ ఇది మరింతగా ఒళ్లు గగుర్పొడిచే వార్త. పానీపూరీ తయారీ, అందులో ఉపయోగించే మసాలా నీరు తయారీకి సంబంధించి పలు విస్తుపోయే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాను చుట్టేశాయి. అయితే, ఇది మాత్రం కొంచెం భిన్నమనే చెప్పాలి.

అసోం రాజధాని గువాహటిలో జరిగిందీ ఘటన. పానీపూరీ అమ్మే వ్యక్తి ఒకడు పట్టపగలు ఎవరూ గమనించకుండా తన మూత్రాన్ని మగ్గులో పట్టి దానిని పానీపూరీని ముంచే మసాలా నీటిలో చటుక్కున కలిపేశాడు. తనను ఎవరూ చూడడం లేదని అతడు అనుకున్నా.. ఓ వ్యక్తి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అతడు చేస్తున్న ‘పనిని’ తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో వదిలాడు. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పానీపూరీ వాలా తన మూత్రాన్ని మసాలా నీటిలో కలపడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పానీపూరీ వాలాపై విరుచుకుపడ్డారు. కొందరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే, అతడు ఎందుకలా చేశాడన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ వీడియోను మీరూ చూడొచ్చు.