మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈమె..తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుమ్మడి కుతూహలమ్మ 1 జూన్ 1949లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా , కందుకూరు లో జన్మించింది. ఆమె ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. అనంతరం ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పనిచేసింది. రాజకీయాలపై ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. వేపంజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.

వేపంజేరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు. ఆమె 1985 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే, 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.