ఓయూ చరిత్రలోనే తొలిసారి ఆదివాసీ మహిళ నియామకం

ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారి ఆదివాసీ మహిళ నియామకం కావడం వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్​ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్​బాగ్​లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్​గా ఆమెను నియమిస్తూ వీసీ ప్రొ. రవీందర్ ​ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ చరిత్రలోనే ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్​గా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో జన్మించిన ఆమె ఓయూలోనే పీజీతో పాటు లా కోర్సులు పూర్తి చేశారు. అనంతరం ఓయూ లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై ఇప్పుడు ప్రిన్సిపల్‌ స్థాయికి ఎదగడం విశేషం.

అనురాధ తండ్రి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్నారు నర్సయ్య. నేటి కాలంలో రాజకీయ విలువలకు, హుందాతనానికి ప్రతీకగా నిలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె ఓయూ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.