అసోం నూతన గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా ప్రమాణం

Gulab Chand Kataria sworn in as Assam governor

గువాహటి: అసోం రాష్ట్ర కొత్త గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు అసోం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్‌ జగదీశ్‌ ముఖి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో గులాబ్‌చంద్‌ కటారియాను గవర్నర్‌గా నియమించారు. గువాహటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సందీప్‌ మెహతా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.

గువాహటిలోని శ్రీమంత శంకర్‌దేవ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కటారియా ప్రమాణస్వీకారం జరిగింది. గులాబ్‌చంద్‌ కటారియా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రాజకీయ నాయకుడు. గతంలో ఆయన రాజస్థాన్ హోంమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్‌గా నియమితులయ్యే వరకు కూడా ఆయన రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.