గుజరాత్‌లో రూ.9,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్టు గుర్తింపు
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కంటెయినర్ల స్వాధీనం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. ఈ ముఠాకు ఏపీలోని విజయవాడతో సంబంధం ఉన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రెండు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ఈ నెల 15న కంటెయినర్లను స్వాధీనం చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చిన ఈ డ్రగ్స్.. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటి వరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు ఏయే దేశాల నుంచి వచ్చాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఆషీ ట్రేడింగ్ కంపెనీ మూలాలు కాకినాడ, విజయవాడ, చెన్నై వరకు విస్తరించినట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/