‘వంట నూనెల ధర రూ.10 తగ్గించండి’ – కంపెనీలకు కేంద్రం ఆదేశం

వంట నూనెలపై రూ.10 తగ్గించండి అంటూ ఆయా కంపెనీలకు కేంద్రం ఆదేశించింది. రష్యా యుద్ధం తర్వాత నూనె ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. నూనె ధరలు తగ్గించాలంటూ సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, దేశీయంగా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్‌ నూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాల్సిందిగా కేంద్రం సూచించింది.

గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా వంటనూనెల ధరలు ప్రియమయ్యాయి. మళ్లీ అంతర్జాతీయంగా వంటనూనెల ధరల్లో దిద్దుబాటు రావడం వల్ల, స్థానికంగా ధరలు తగ్గించమని ప్రభుత్వం ఆదేశించింది. గత నెలలో నూనె ధరను లీటర్‌కు రూ.10-15 వరకు కంపెనీలు తగ్గించాయి. ప్రస్తుత ధోరణులపై వంటనూనెల సంఘాలు, ప్రధాన తయారీ కంపెనీలతో సమావేశమైన ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే, తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించారు.