తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ ..పూర్తిగా తెలుగులో ప్రసంగం చేసిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా గవర్నర్ తమిళిసై గురువారం రాజ్ భవన్ లో తెలుగులో ప్రసంగం చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంది. ‘‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’’ అని అన్నారు. తాను రాష్ట్రానికి గవర్నర్ గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను, కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు.

‘‘తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి మోడీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా రాజ్ భవన్ స్కూలులో విద్యార్థుల కోసం భోజన ఏర్పాటు చేశాను. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాను’’ అని తమిళిసై వివరించారు.