గవర్నర్ జెట్ కంటే వేగంగా స్పందించారు: సంజయ్ రౌత్

గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇల్లీగల్ అన్న సంజయ్ రౌత్

Sanjay Raut
Sanjay Raut

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే కొనసాగుతారా? లేక ఆయన ప్రభుత్వం కూలిపోతుందా? అనే విషయం రేపు తేలిపోబోతోంది. అసెంబ్లీలో రేపు బలాన్ని నిరూపించుకోవాలని ఉద్ధవ్ థాకరేను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ గవర్నర్ పై విమర్శలు గుప్పించారు.

జెట్ కంటే గవర్నర్ వేగంగా స్పందించారని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూడా ఇంతకంటే వేగంగా కదలదని చెప్పారు. బల నిరూపణ కోసం గవర్నర్ ఆదేశించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే… బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం ఇల్లీగల్ అని చెప్పారు. ఈ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనంత వరకు ఫ్లోర్ టెస్ట్ వద్దని తాము చెపుతూనే ఉన్నామని అన్నారు.

తాము ప్రతి ఒక్కటి చట్టానికి లోబడే చేశామని సంజయ్ రౌత్ తెలిపారు. మీరు మాతో పోరాడాలనుకుంటే ముందు వైపు నుంచి పోరాడాలని చెప్పారు. గవర్నర్ గురించి తాము ఎక్కువగా మాట్లాడబోమని, ఆయన రాజ్యాంగపరమైన పెద్ద అని అన్నారు. అయితే ఆయన వివక్షపూరితంగా వ్యవహరిస్తే తాము కూడా దానికి తగిన విధంగా వ్యవహరిస్తామని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/