పీవీ ఒక కీర్తి శిఖరం..సీఎం కెసిఆర్
కాకతీయ వర్సిటీలో పీవీ విద్యా పీఠం..సీఎం కెసిఆర్
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆనంతరం పీవీ మార్గ్లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను పీవీ నరసింహారావు తీసుకొచ్చారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలోనే చదివి డీజీపీని కాగలిగానని మహేందర్ రెడ్డి స్మరిస్తూంటారు. ఇలా ఎంతో మంది పీవీని స్మరించుకుంటారని సీఎం పేర్కొన్నారు. మన కాకతీయ వర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తున్నదని పేర్కొన్నారు. పీవీ అనేక పుస్తకాలు రచించారు. అనేక రచనలను ఆయన అధ్యయనం చేశారు. స్వాతంత్య్రం పూర్వం వారు జన్మించినప్పటికీ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు అని సీఎం గుర్తు చేశారు.
తాజా జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/