నేటి నుండి 12 వరకు నులిపురుగుల కార్యక్రమం
హైదరాబాద్: ఈనెల 5 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ అధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. కోటీ 3లక్షల మందికి ట్యాబ్లెట్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నులి పురుగులు (నట్టలు) చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రభుత్వం ప్రతిఏడాది నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈసారి వారం రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించునున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఏడాది నుంచి రెండేండ్ల పిల్లలకు సగం మాత్ర, రెండేండ్ల నుంచి 19 ఏండ్ల వయసున్న వారికి 400 మిల్లీ గ్రాముల మాత్రలు అందించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/