షెడ్యూల్ ప్రకారమే అమర్నాథ్ యాత్ర.. కాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం
జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అమర్నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లోయలో జరుగుతున్న హత్యా ఘటనలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న ఘటనలను నిరోధించవచ్చు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో పండిట్లపై దాడులు జరుగుతున్నట్లు వారంటున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ హత్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసే విధంగా హత్యా ఘటనలు జరుగుతున్నాయని, అయినా వెనక్కి తగ్గేదిలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
2020 నుంచి కోవిడ్ వల్ల అమర్నాథ్యాత్రను నిలిపేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే 2.5 లక్షల మంది యాత్రికులు ఆ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. కశ్మీర్ పండిట్లను జమ్మూకు తరలించేది లేదని, 1990 తరహా లాంటి ఘటనలు జరగనివ్వమని, కానీ పండిట్లను లోయలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇటీవల పండిట్లను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్లు కశ్మీర్ను వదిలివెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు వేల మంది హిందూ ఉద్యోగులను ఇప్పటికే మరో ప్రాంతానికి తరలించారు.ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కశ్మీర్కు 10 లక్షల మంది టూరిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/