రూ.30 కోట్ల హెలీకాఫ్టర్ ను కేవలం రూ.4 కోట్లకు అమ్మేస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం
ఈరోజుల్లో ఫారెన్ కార్లు సైతం కోట్లు పలుకుతుంటే..ఓ హెలీకాఫ్టర్ మాత్రం కేవలం రూ. 4 కోట్లకు అమ్మకానికి పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. మాములుగా హెలీకాఫ్టర్ల ఖరీదు కోట్లలో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక రాజకీయనేతలు ఉపయోగించే హెలీకాఫ్టర్లు మాత్రం ఇంకాస్త ఖరీదు ఉంటాయి. ఎందుకంటే వారి భద్రతకు అనుగుణంగా ఉండే హెలీకాఫ్టర్లను కొనుగోలు చేస్తారు కాబట్టి. అయితే రాజస్తాన్ ప్రభుత్వం 2005లో వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీ నుంచి ట్ఇన్ ఇంజిన్ 109 ఈ హెలీకాఫ్టర్ను రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారట.
ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న అశోక్ గెహ్లాట్ అధికారిక కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ హెలీకాఫ్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఆ హెలీకాఫ్టర్ ను పక్కకు పెట్టారట. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారుతున్నప్పటికీ ఆ హెలీకాఫ్టర్ ను మాత్రం వాడడం లేదట. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం ఆ హెలీకాఫ్టర్ను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించి టెండర్లకు పిలిచారట. అయితే దానిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రాలేదట. ఒకటి , రెండుసార్లు కాదు 12 సార్లు టెండర్లకు పిలిచిన ఎవ్వరు రాకపోయేసరికి..ఇప్పుడు ఏకంగా రూ. 26 కోట్లు తగ్గించి కేవలం రూ. 4 కోట్లకు అమ్మకానికి పెట్టారట. మరి ఈసారైనా ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తారేమో చూడాలి.