రైతుల ఆందోళనపై పార్లమెంట్లో 15 గంటల చర్చ
ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన అంగీకారం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో రైతుల ఆందోళన అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనిపై రాజసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. బుధవారం ప్రతిపక్షాలతో సమావేశమైన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్చ రాజ్యసభలో జరగనుంది. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ చర్చ జరపనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశాయి.
ముగ్గురు ఆమ్ ఆద్మీ సభ్యులు పదేపదే నినాదాలు చేయడంతో వాళ్లను సభ నుంచి బయటకు పంపించేశారు. కేవలం రైతుల ఆందోళనలపైనే ఐదు గంటల పాటు చర్చ జరపాలని 16 ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దానిని 15 గంటలకు పెంచడానికి అంగీకరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రకటన చేశారు. చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/