టీడీపీలో చేరిన వైస్సార్సీపీ గోవర్ధన్ రెడ్డి..
వైస్సార్సీపీ పార్టీ కి బిగ్ తగిలింది. పార్టీ నేత గోవర్ధన్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైస్సార్సీపీ కీలక నేత గుదిబండ గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి విపక్ష టీడీపీలో చేరిపోయారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు… గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైస్సార్సీపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్న భావనలో ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓ స్పష్టమైన లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్లపాటు వైస్సార్సీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం.
గోవర్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు… జగన్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. వైస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ఆ పార్టీ నేతలే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడటమేనన్నారు. మనసున్న కార్యకర్తలు వైస్సార్సీపీ లో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని చంద్రబాబు అన్నారు.
దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. నిన్న ఒక్కరోజే జరిగిన ఐదు సంఘటనలు చూసి బాధేసిందన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్ శవమై తేలారన్నారు. నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారన్నారు. అన్ని జిల్లాల్లో రౌడీయిజం పరాకాష్టకు చేరిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.