సత్ప్రవర్తన – సత్సంగం

ఆధ్యాత్మిక చింతన

Devotional

పొగత్రాగటం, మద్యాన్ని సేవించటం, పేకాట ఆడటం, వ్యభిచరించటం, అబద్ధాలాడటం, మోసగించటం, దొంగతనం చేయటం, దురుసుగా మాట్లాడటం, దౌర్జన్యం చేయటం, అక్రమంగా సంపాదించటం, ఇవన్నీ దురలవాట్లనీ, ఆ అలవాట్లున్న వారు దుష్టులు, దుర్మార్గులు అని, అలాంటి వారితో కలసి తిరగటం దుష్ట సాంగత్యము అంటుంటారు.

ఇటీవల ప్రతి ఊళ్లోను సంఘాలు ఎక్కువయ్యాయి. సత్సంగంలో పాల్గొనే వారు ఎక్కువయ్యారు. ఎవరిని అడిగినా ‘సత్సంగంలో పాల్గొని వస్తున్నానని జవాబు చెబుతారు.

అక్కడ ఏమి చేసి వచ్చారని అడిగితే భజనలు చేశామని, విష్ణు సహస్రనామ పారాయణనాన్ని చేశామని, సద్గ్రంధ పఠనం చేశామని, ప్రవచాలు విన్నామని, గీతా అధ్యయనం చేశామని, వేదాంత గోష్టి నిర్వహించామని సంతోషంగా, ఒకింత గర్వంతోను చెబుతుంటారు.

ఒకసారి తిరువణ్ణామలైలోని శ్రీరమణాశ్రమంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. భగవాన్‌ రమణమహర్షిని ఒకాయన అడిగాడు,

‘ముక్తి పొందటానికి సత్‌ ప్రవర్తన చాలాదా? అని. అప్పుడు మహర్షి అన్నాడు ‘సత్‌ప్రవర్తన ఏమి? అసలు ప్రవర్తన అంటే ఏమిటి? పూర్వ సంస్కారాలను బట్టి ఇది సరి, ఇది కాదు అని నిర్ణయించుకుంటాడు.

సత్యాన్ని తెలిసినప్పుడే సరియైనదేదో తెలుస్తుంది. ఉత్తమపద్ధతి ఏమిటంటే ఆ ముక్తిని కోరేది ఎవరో కనుక్కోవడం.

ఆ కోరిక కోరే వాడిని లేదా అహంకారాన్ని దాని మూలాన్ని జాడ తీస్తూ పోవడమే, సత్‌ ప్రవర్తన. భగవాన్‌ రమణ మహర్షి క్లుప్తంగా చెప్పిన విషయము ఎంతో లోతైనదనిపిస్తుంది.

జాగ్రత్తగా, నిదానంగా యోచించాలి. అసలు ప్రవర్తన అంటే ఏమిటి? అని వారు ప్రశ్నించారు.

మనం ప్రవర్తన అంటే నడచుకునే విధానమని, మసలుకునే విధానమరి, జీవించే విధానమని అనుకుని ఇతరులకు హాని చేయక, మేలు చేస్తూ జీవిస్తే ఆన్ని సత్‌ప్రవర్తన అనొచ్చు అని అంటాము.

అంటే తెల్లవారు జాముననే లేచి, స్నానం చేసి దేవ్ఞనికి పూజచేసి, ఆ తర్వాత భాగవతాది గ్రంథాల్ని చదివి, పేదలకు అన్నదానం చేసి ఇలా జీవితాంతం జీవిస్తే, అలాంటి సత్‌ప్రవర్తన ఒక్కటే చాలదా ముక్తి పొందటానికి అని అతని భావం అయి ఉండవచ్చు.

రమణ మహర్షి జీవితాన్ని గమనిస్తే బహుశా ఇవి ఏవి ఆయన పాటించినట్లు కనపడదు.

అందేకాదు ఎంతో మంది మహనీయులు వాటిని పాటించినట్లు కనపడదు. అంటే వారికి సత్‌ ప్రవర్తన లేదనే చెప్పాల్సి ఉం టుంది. పైగా మనం వేటినైతే దురలవాట్లుగా భావిస్తామో అవి వారికి ఉండేవి.

రామకృష్ణ పరమహంస, వివేకానందులు హుక్కా పీల్చేవారు, నిసర్గదత్త మహరాజ్‌ చేపల్ని తినేవారు. రమణమహర్షి పిల్లి పిల్లల్ని చంపాడట! తెలీక చేశాడనుకోండి.

తెలిసి చేసినా, తెలియకచేసినా పాపమే కదా! వారి ప్రవర్తన బాగాలేనట్లేగా? ప్రపంచమంతా ఆయన్ను ‘మహర్షి అని అంటుందే? అహంకారాన్ని, దాని మూలాన్ని కనుక్కొనటానికి చేసే ప్రయత్నాన్ని ఆయన ‘సత్‌ ప్రవర్తన అని అంటున్నారు.

దాని కనుగొన్న వారిని సత్పురుషులు అనవచ్చు. అలాంటి వారితో గడిపితే, మాట్లాడితే, చర్చిస్తే, ప్రశ్నిస్తే, దాని సత్‌ సంగం అనవచ్చు.

వారు చూపిన బాటలో పయనిస్తే, వారి అడుగుజాడల్లో నడిస్తే ‘సత్‌ను దర్శింపవచ్చు. సత్‌ గానే మారిపోవచ్చు.

అంతేగానీ ఏదో ఒక పండితుడు సుదీర్ఘంగా భాగవత ప్రవచనం చేస్తుంటే విని సంతోషించవచ్చు.

ఆహా! ఓహో అనవచ్చు గానీ మనం మారము. మన జీవన విధానం మారదు. మన ఆలోచని విధానం మారదు. మన ప్రవర్తన మారదు, ముక్తి రావటం కాదు కదా, ఆధ్యాత్మికంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.

అది సత్‌ సంగము కాదు, సత్ప్రవర్తన కానేకాదు. అహం కరిగిపోయి బ్రహ్మం మాత్రమే మిగిలే బదులు అహం పెరిగి, పెరిగి బ్రహ్మం మరుగున పడిపోతుంది. పతనమంటే అదే.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/