ఇకపై వీసా దరఖాస్తుదారుల కోసం శనివారాల్లో ప్రత్యేక స్లాట్లు

ఈ నెల 21న ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించిన దౌత్య కార్యాలయాలు

visa
visa

న్యూఢిల్లీః అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారికి ఇది కచ్చితంగా శుభవార్తే. దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు శనివారం కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. అంతేకాదు, గత శనివారం (21న) ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్లు శనివారం ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించాయి. వచ్చే నెలలోనూ ఎంపిక చేసిన శనివారాల్లోనూ వీసా దరఖాస్తుదారుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీసా కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న నేపథ్యంలో దౌత్య కార్యాలయాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

అలాగే, గతంలో అమెరికా వీసా కలిగిన వారికి ఇంటర్వ్యూ లేకుండా రిమోట్ ప్రాసెసింగ్ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. వీసాల జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జనవరి-మార్చి మధ్య వాషింగ్టన్, ఇతర ఎంబసీల నుంచి పదుల సంఖ్యలో అధికారులు భారత్‌కు రానున్నారు. అదనపు అపాయింట్‌మెంట్ల కోసం ముంబై కాన్సులేట్ జనరల్ వారంలో పనిగంటల సంఖ్యను పెంచింది. ఈ వేసవికల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని అమెరికా అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/