తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగాయి – గోనె ప్రకాశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోతుందని, రోజురోజుకు అవినీతి పెరిగిపోతుందని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు. రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడుల వెనుక అధికార పార్టీ అవినీతే కారణమని అన్నారు.

కరీంనగర్ ప్రెస్ భవన్‌లో ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీటీసీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి పెరిగిపోయిందని , అందుకే రాష్ట్రంలో మావోయిస్టు హెచ్చరికలు మొదలయ్యాయయని.. టీఆర్ఎస్ నాయకులు ఇలానే అవినీతి చేస్తుంటే రానున్న రోజుల్లో అన్నలు వస్తారని.. పది నిమిషాల్లో చంపేసి వెళ్తారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ ఉద్యోగాల మాఫియా, అవినీతిపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారంటూ గొనె ప్రకాష్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి సీఎం కేసీఆర్‌కి తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8 కోట్ల ఆస్తిని ఆక్రమించినా అతనిపై చర్యలు లేవంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని.. మావోయిస్టులు దాడి చేయాలనుకుంటే పది నిమిషాల్లోనే పని పూర్తి చేసి బార్డర్ దాటి వెళ్లిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.