వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం.. తిరిగి కాశీకి

కెనడాలో విగ్రహాన్ని గుర్తించిన వైనం
అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి విగ్రహాన్ని తెప్పించిన భారత ప్రభుత్వం


న్యూఢిల్లీ: వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్ కు చేరుకుంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం వందేళ్ల క్రితం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. ఆ తర్వాత విగ్రహాన్ని వెనక్కి రప్పించేందుకు కెనడా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది. భారత ప్రభుత్వ విన్నపానికి కెనడా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో విగ్రహం మళ్లీ భారత్ కు చేరుకుంది. ఈ విగ్రహాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విగ్రహానికి అన్నపూర్ణ దేవి యాత్ర పేరుతో నాలుగు రోజుల పాటు శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విగ్రహానికి పునఃప్రతిష్ట జరగనుంది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు చర్చలు జరిపి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. కొన్ని రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు కూడా విదేశాల్లో ఉన్న విగ్రహాలను అందిస్తామని చెప్పారు. మన దేశానికి చెందిన అనేక విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని తెలిపారు. విదేశాల్లోని విగ్రహాలు, చిత్రపటాలు, చిహ్నాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకొస్తున్నారని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/