కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి వరద ఉధృతి
Rajamahendravaram: గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
సోమవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది.
దీంతో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
బ్యారేజీ నుంచి 18లక్షల 46 వేల 428 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి భద్రాచలం వద్ద 60.50 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదిలావుంటే గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 10.01 మీటర్లు, పేరూరు వద్ద 15.50, దుమ్ముగూడెం వద్ద 16.90, కూనవరం వద్ద 23.41, కుంట వద్ద 15.45 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది.
కొయిదా వద్ద 28.06, పోలవరం వద్ద 15.04, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 18.14 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/