రాజీనామా చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
గోవా సీఎంగా కొనసాగుతా : ప్రమోద్ సావంత్

పనాజీ : గోవాలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తూ ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైకి శనివారంనాడు ఆయన అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా ఈ సందర్భంగా సావంత్ను గవర్నర్ కోరారు.
కాగా, తదుపరి గోవా సీఎం ఎవరనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా గోవా సీఎంగా తాను కొనసాగుతానని ఆపద్ధర్మ సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గంలో స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తాను రాష్ట్ర ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టానని త్వరలోనే సీఎం పేరు ఖరారవుతుందని చెప్పారు. కేంద్ర పరిశీలకులు త్వరలో రాష్ట్రానికి రానున్నారని ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి ఆపై రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము ముందుకొస్తామని చెప్పారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఎంజీపీ ఎమ్మెల్యే మద్దతు తమకుందని మెజారిటీ విషయంలో తాము తొందరపడాల్సిన అవసరం లేదని సావంత్ చెప్పుకొచ్చారు. గోవాలో 40 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 20 స్దానాల్లో విజయం సాధించింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/