చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ పెద్ద బాంబ్ పేల్చిన ఏపీ పీసీసీ చీఫ్

ఓ పక్క రాజకీయాల్లో నేను లేను..నా దృష్టి అంత సినిమాలపైనే ఉందని , రాజకీయాలతో నన్ను కలపవద్దని మెగా స్టార్ చిరంజీవి అంటుంటే..చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. తాజాగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని , ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేసేలా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని.. అక్రమాలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రజా వ్యతిరేక పాలనపై జనం విసిగిపోయారన్నారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 26 నుంచి మార్చి 26 వరకు పార్టీ కార్యకర్తలు పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని.. ఆయనకు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ఈయన మాటలు విన్నవారు అంత ఆశ్చర్యపోతున్నారు. ఓ పక్క చిరంజీవి రాజకీయాల్లో లేనని చెపుతుంటే..రుద్రరాజు ఇలా చెపుతున్నారేంటి అని మాట్లాడుకుంటున్నారు.