గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్టు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అరెస్టు
ఉజ్జయిని: గ్యాంగస్టర్ వికాస్ దూబే మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతడి కోసం 25 పోలీసు బృందాలు హర్యానా, మధ్యప్రదేశ్లో గాలిస్తోన్న విషయం తెలిసిందే. అతడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పట్టుకున్నారు. అనంతరం అతడిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా యూపీలోని హమీర్పూర్లోని మౌదాహా గ్రామంలో పోలీసులు నిన్న ఎన్కౌంటర్లో వికాస్ అనుచరుడు అమర్ దూబేను హతమార్చారు. దీంతో తనను కూడా కనపడగానే హతమార్చుతారని భయపడుతోన్న వికాస్ దూబే పోలీసులకు లొంగిపోవాలని ప్రయత్నాలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. గత వారం కాన్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్రధాన నిందితుడు. వికాస్ కోసం గత అయిదు రోజుల నుంచి యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న నలుగురు క్రిమినల్స్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/