కరీంనగర్‌లో దారుణం : విగ్రహ తయారీదారులపై దుండగులు దాడి..10 లక్షల అపహరణ

పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులపై దాడి చేసి రూ. 10 లక్షలతో పాటు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…

ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కొందరు కార్మికులు కరీంనగర్ జ్యోతినగర్‌లో గుడిసెలు వేసుకుని గణేష్ విగ్రహాలు తయారుచేస్తుంటారు. తాజాగా గణేష్ విగ్రహాలు అమ్ముడుపోయి భారీ లాభాలు వచ్చాయి. దీంతో వీరిపై కొంతమంది దుండగులు కన్నేశారు. శనివారం రాత్రి గుడిసెల్లోకి ప్రవేశించి కార్మికులపై దాడి చేసి నగదు, బంగారు వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కరీంనగర్ టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తమ వద్దనున్న రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. వారి నుండి పిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

గత ఏడాది కరోనా నేపథ్యంలో గణేష్ నవరాత్రులు పెద్దగా జరగకపోయేసరికి విగ్రహదారులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు అంత బాగుంది..మంచి లాభాలు వచ్చాయి అని సంతోషించేలోపే ఇలా దుండగులు వచ్చి డబ్బంతా ఎత్తుకెళ్లారని వారంతా వాపోతున్నారు.