ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దాడి

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ పై దాడి జరిగింది. పృథ్వీతేజ కారును అడ్డగించి అందులోకి దుండగులు ఎక్కి అనంతరం కత్తితో బెదిరించి రూ. 75 వేలు దోపిడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ ఆదివారం ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లి తిరిగి కారులో వెళ్తుండగా కొందరు దుండగులు కారులోకి చొరబడ్డారు. ఆయన్ని బెదిరించి రూ.75వేల నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పృథ్వీతేజ ఇంటికి వెళ్లిపోయి తన వ్యక్తిగత సిబ్బందికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో వారు పంజాగుట్ట పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై పృథ్వీతేజ ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.