వినాయక నిమజ్జనం విషయంలో దిగొచ్చిన టీఎస్ సర్కార్

హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబడింది. ఈ తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇచ్చారు.

ఇక హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఓవైపు గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదని తలసాని అన్నారు. నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తలసాని స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.