తన పెద్ద మనసు చాటుకున్నగంభీర్
పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్
న్యూఢిల్లీ: టీమిండియ మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ అనారోగ్యంతో మరణించిన తమ పనిమనిషి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి తన ఉదారత చాటుకున్నారు. గంభీర్ ఇంట్లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న సరస్వతి పాత్రా (49) కొంతకాలంగా అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధితో బాధపడుతోంది. కొన్నిరోజుల కిందట ఆమె అస్వస్థతకు లోనవడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 21న ఆమె కన్నుమూసింది. దీనిపై గంభీర్ ట్విట్టర్ లో స్పందించారు. ‘ఆమెను మేం ఎప్పుడూ పనిమనిషిగా భావించలేదు. మా కుటుంబసభ్యుల్లో ఒకరిగానే పరిగణించేవాళ్లం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, సామాజిక హోదా ఏదీ పట్టించుకోలేదు. వ్యక్తిత్వాన్ని గౌరవించాను’ అంటూ పేర్కొన్నారు. సరస్వతి పాత్రా స్వరాష్ట్రం ఒడిశా. లాక్ డౌన్ కారణంగా ఆమె మృతదేహాన్ని జయపూర్ జిల్లాలోని స్వస్థలానికి పంపించే వీల్లేకపోవడంతో గౌతమ్ గంభీర్ ఢిల్లీలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/