నన్ను రక్షించండి అంటూ పోలీసులకు గద్దర్ వినతి

ప్రజా గాయకుడు గద్దర్ పోలీసులకు వినితి పత్రం అందజేశారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాములును కలిసి వినతి పత్రం అందించారు. రఘునాథపల్లి మండలం మండల గూడెం గ్రామంలో బాల సాయిబాబా ట్రస్ట్ భూములు ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆయన పోరాటం చేయనున్నట్లు గద్దర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి తరచూ వస్తున్నానని.. అందువల్ల కొందరు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని.. ఆయన కలెక్టర్, డీసీపీలను కోరారు.

ఇదిలా ఉంటే తాజాగా బాల సాయిబాబా కుటుంబ సభ్యులు సదరు భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తుంది. మూడు రోజుల క్రితం గద్దర్ ఈ భూముల విషయమై వివరాలు ఇవ్వాలంటూ రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కలిసి సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ఈ విషయంపై వివరంగా మాట్లాడతానని గద్దర్ వివరించారు.