సైనిక లాంఛనాలతో వీర జవాన్ జశ్వంత్ అంత్యక్రియలు
జశ్వంత్ త్యాగం మరువలేనిదన్న హోంమంత్రి
గుంటూరు: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బాని సెక్టార్లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్రెడ్డి (23) అమరుడైన విషయం తెలిసిందే. అయితే జవాన్ జశ్వంత్రెడ్డి సొంత గ్రామం దవివాదకొత్తపాలెంలో ఈ రోజు అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జశ్వంత్రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రకు స్థానికులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన ఏపీ హోంమంత్రి సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి రూ.50 లక్షల చెక్కును అందించారు. చిన్న వయసులోనే జశ్వంత్ మరణించడం బాధాకరమని ఆమె అన్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జశ్వంత్ త్యాగం మరువలేనిదని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు సీఎం జగన్తో మాట్లాడతామని మీడియాకు చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: