కేసీఆర్ సంచలన నిర్ణయం ..షుగర్‌, బీపీ రోగులకు ఉచితంగా మందుల సరఫరా

షుగర్‌, బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు కేసీఆర్ సర్కార్ ఉచితంగా మందులు ఇవ్వబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడం లో భాగంగా పరీక్షలు నిర్వహించగా… 7 లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బిపి పేషెంట్లు ఉన్నట్లు తేలింది.
వీరందరికీ దశలవారీగా NCD కిట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. షుగర్ మరియు బీపీ నియంత్రణ మందులు అందించే ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ‘ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాటు” అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించింది.

సమతుల ఆహారం, వ్యాయామం, పొగ తాగరాదు, జంక్‌ ఫుడ్‌ తినరాదు, మద్యం సేవించరాదు, యోగా, మంచి నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పేర్కొన్నది. రెండో వైపు షుగర్‌, బీపీ లక్షణాలతోపాటు వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. కిట్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకొనే మందులు నెలకు సరిపోయే షుగర్‌, బీపీ మందులను ఉంచి కిట్లను రోగులకు అందించనున్నారు.