ఈడీ నోటీసుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలు
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు లో ప్రస్తుతం కీలక నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్లో కలవరం మొదలైంది.
ఈడీ నోటీసులు అందుకున్న వారిని కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రమ్మని పిలుపునివ్వడంతో నిన్ననే కొందరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ లో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ను పలు గంటల సేపు ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఇక ఈడీ కేసులో భాగంగా విరాళమిచ్చిన పలువురు నేతలకు ప్రస్తుతం ఈడీ నోటీసులు జారీ చేసారు. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, గీతారెడ్డి , రేణుకాచౌదరి, అంజన్ కుమార్, గాలి అనిల్కుమార్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.