మరో 8 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో 49కి చేరిన బాధితులు

ఢిల్లీలో 4, రాజస్థాన్ లో 4 కొత్త కేసులు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఉనికి చాటుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 60 దేశాలకు పాకింది. భారత్ లోనూ ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4, రాజస్థాన్ లో 4 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దాంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 49కి పెరిగింది.

ఢిల్లీలో ఇప్పటివరకు 6 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీనిపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందిస్తూ, వారిలో ఒకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. మిగిలిన ఐదుగురికి చికిత్స జరుగుతోందని తెలిపారు. అటు, రాజస్థాన్ లో కొత్తగా వెల్లడైన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాడీ లాల్ మీనా పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/