ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలు బలి తీసుకున్న టపాసులు

దీపావళి పండగను ఎంతో సంబరంగా జరుపుకోవాలని చూసిన ఆ కుటుంబంలో విషాదం అల్లుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు కుటుంబ సభ్యులను టపాసులు బలి తీసుకున్నాయి. కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్‌ మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు టపాకాయలు, ఇతర వస్తువులు కొనుగోలు కోసం కారులో కామారెడ్డి జిల్లాకు వచ్చి సొంత గ్రామం ఎల్లారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. వర్షం కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న వారంత తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తుండగా కారును నడుపుతున్న అల్లుడు ఆనంద్‌కుమార్‌(31), మామ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ సోదరుడు జగన్‌, మనుమడు సుశాంక్‌ మృతి చెందారు. మరో నలుగురు తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్సపొందుతున్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలించారు. పండుగ వేళ ఒకే కుటుంబానికి నల్గురు మృతి చెందడం పట్ల వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.