30న టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించడమే లక్ష్యమని వ్యాఖ్య‌

హైదరాబాద్ : బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగల పెద్ది‌రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. ఈ నేప‌థ్యంలో తాను టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు ఆయ‌న ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేర‌తాన‌ని చెప్పారు. తాను పదవుల‌ కోసం ఆశప‌డి టీఆర్ఎస్‌ పార్టీలో చేరడంలేదని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కాగా, మొదట టీడీపీలో కీల‌క నేత‌గా పేరు తెచ్చుకున్న పెద్దిరెడ్డి, తెలంగాణ ఏర్పడిన అనంత‌రం బీజేపీలో చేరారు. హుజూరాబాద్ అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరినప్పటి నుంచి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/