మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి
సీఎం కేసీఆర్ సంతాపం
Hyderabad: ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడింది. హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నారు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం ఆయన మృతి చెందారు. ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.
గతంలో సిఎంలు నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు వద్ద ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేశారు. కాగా 1975 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కడప, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అనంతరం పలు ప్రభుత్వ విభాగాలకు చైర్మన్గా, కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. రోశయ్య హయాంలో సీఎస్గా పనిచేశారు. ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/