జూన్‌ 2న బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్

అహ్మదాబాద్‌ : పాటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్.. కాషాయ దళంలో చేరనున్నారు. జూన్​ 2న బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్​ పాటిల్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్​ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీలో హార్దిక్ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నేళ్ల క్రితం గుజరాత్​లో జోరుగా సాగిన పాటీదార్ ఉద్యమంలో హార్దిక్ కీలక పాత్ర పోషించారు. 2019లో ఆయన కాంగ్రెస్​లో చేరారు. అయితే.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందే.. హార్దిక్ కాంగ్రెస్​పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. పేరుకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు.

కాగా, పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు హార్దిక్ పటేల్. రాష్ట్ర నాయకులకు దిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలకు చికెన్ సాండ్​విచ్ సమయానికి అందిందో లేదో చూసుకోవడమే ముఖ్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా పట్టవని ధ్వజమెత్తారు. సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్​గా తీసుకోదని, అదే అతిపెద్ద సమస్య అని ఆరోపించారు. దేశం సవాళ్లు ఎదుర్కొనే సమయంలో సరైన నాయకత్వం అవసరమైన ప్రతిసారి పార్టీ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్తారని విమర్శించారు. గుజరాత్​, గుజరాతీలు అంటే పడనట్లు కాంగ్రెస్ అధినాయకత్వం మాట్లాడుతుందని, అలాంటప్పుడు రాష్ట్రంలో బీజేపీకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/