బాలాకోట్ దాడితో ఉగ్రవాదులు భయపడ్డారు
బాలాకోట్ ఆపరేషన్ నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వాముయసేన మాజీ అధిపతి బీఎస్ ధనోవా నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. బాలాకోట్ దాడితో ఉగ్రవాదులు భయపడ్డారని, అందుకే ఆ దాడి తర్వాత భారత్లో ఎలాంటి పెద్ద ఉగ్ర ఘటనలు చోటుచేసుకోలేదని ధనోవా అన్నారు. ఇప్పుడు మేం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుందన్నారు. బాలాకోట్ ఆపరేషన్ నుంచి మేం ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. మేం చేపట్టే ఆపరేషన్లలో ఇది కీలకమైన మార్పు. పాక్ భూభాగంలో ఉగ్ర శిబిరాలపై దాడులు జరుపుతామని ఆ దేశం ఎన్నడూ ఊహించి ఉండదు. కానీ మేం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గతేడాది మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా బాలాకోట్ దాడి నిరోధకంగా పనిచేసిందని తెలిపారు. వైమానిక దాడులతో ముష్కరులకు ముచ్చెటమలు పట్టాయని అన్నారు. మళ్లీ ఉగ్ర ఘటనలు జరిగితే మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుందనే విషయం ఉగ్రవాదులకు అర్థమైంది. అందుకే బాలకోట్ దాడి తర్వాత దేశంలో ఎలాంటి పెద్ద ఉగ్ర ఘటనలు చోటుచేసుకోలేదన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/